ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతలకు రుణ మాఫీ చేశామని, ఉచిత కరెంట్ ఇచ్చామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ. 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదల కోసం 30 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశామని చెప్పారు. మైనార్టీలకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. వక్ఫ్బోర్డ్ ఆస్తులు కాపాడుతున్నామని, షాదీఖానాలు, దర్గాలు నిర్మించామన్నారు. విదేశీ విద్యకు రూ. 15 లక్షలు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మళ్ళీ అధికారంలోకి వస్తే, పెన్షన్లను రూ. 3 వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్ వస్తుందన్నారు. బుడగజంగాల సమస్య ఓ కొలిక్కి తెస్తామని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన హామీలు అడిగితే ప్రధాని మోదీ తనపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని, మోదీ, అమిత్షా కలిసి అధికారుల్ని బదిలీ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈసీ, మోదీ, కేసీఆర్.. జగన్కు సహకరిస్తున్నారని, జగన్ శాశ్వతంగా లోటస్పాండ్లో ఉండాలంటే.. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. జగన్కి ఓటేస్తే మనపై భస్మాసుర హస్తం పెట్టుకున్నట్లేనని చంద్రబాబు అన్నారు.