కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలో రోజువారీ కూలీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. లాక్డౌన్ పొడిగింపుతో ఆకలి కేకలు మిన్నంటాయి. అయితే ఈ కష్ట సమయంలో ఎంతోమంది బాలీవుడ్ హీరోలు ముందుకొచ్చి సాయం చేశారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ పేదలకు వినూత్నం సాయం చేశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధిలో వచ్చి ఆగిందట అందులో ఉన్నవాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్లను పేదలకు అందించారు. అయితే కొందరు మాత్రం ఉత్తి పిండికేనా ఇదంతా అని వెనుదిరిగిపోయారు. కానీ కనీసం అది కూడా లేని నిరుపేదలు ముందుకొచ్చి ఆ ప్యాకెట్లను ఆదుర్దాగా అందుకున్నారు. ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా అందులో పదిహేను వేల రూపాయలు కనిపించాయట. ఇక ఈ ట్రక్కును పంపించింది అమీర్ ఖానే అంటున్నారు అతని అభిమానులు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన వంతుగా సామాజిక సేవను వినూత్నంగా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోధుమ పిండి సంచుల్లో పేదల కోసం రూ.15 వేలు పంపించాడనే ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
previous post