అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 145మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారని తెలుస్తుంది. వీరితో పాటు మరికొంత మంది బంగ్లాదేశీయులు, శ్రీలంక వాసులు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరంతా అక్రమ మార్గంలో అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొంత మంది వీసా గడువు ముగిసినప్పటికీ.. అక్రమంగా అక్కడే నివసిస్తున్నట్లు తేల్చారు.
గతంలోనూ 117మంది భారతీయుల్ని వెనక్కి పంపింది అమెరికా. అలాగే ఒక మహిళ సహా 311 మందిని మెక్సికో వెనక్కి పంపిన విషయం తెలిసిందే. డాలర్ల ఆర్జన కలలతో వీరంతా ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అంతర్జాతీయ ఏజెంట్లకు చెల్లించి అక్రమంగా మెక్సికోకు చేరుకోగలిగారని ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.