దేశంలో మరో సారి సామాన్యులకు షాకిస్తూ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఈ రోజు గ్యాస్ ధరను పెంచాయి.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి జీవనం సాగడం కష్టమవుతుంది .ఆయిల్ కంపెనీల నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కూడా మిన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే పెంచాయి. ఈ మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది.
హైదరాబాద్లో అయితే ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. ఈ పెంపు ఈరోజు నుంచే అమల్లోకి రానుంది.
మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 10 రోజుల కిందటే డొమెస్టిక్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు పెంచాయి. ఈ కారణంగానే ఇప్పుడు ధరలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది.