telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియాంకను తొలగించాలంటూ పాక్ డిమాండ్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఐరాస

Priyanka-Chopra

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను పాకిస్థాన్ టార్గెట్ చేసింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రాను వెంటనే తప్పించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. కాశ్మీర్ అంశంతో పాటు పాక్‌పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారని మజారీ ఐరాసకు రాసి లేఖలో వివరించారు. శాంతి దూతగా ఉండాల్సిన అర్హత ప్రియాంక చోప్రాకు లేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాశ్మీర్‌లో ప్రజల హక్కులను కాలరాస్తోందని… అలాంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథ్యంలోని ఆర్మీకి ప్రియాంక చోప్రా ఎలా మద్దతు పలుకుతారని మజారీ ప్రశ్నించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రియాంక చోప్రా ఐరాస గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అనర్హురాలని మంత్రి మజారీ ఆరోపించారు. వెంటనే ఆమెను తొలగించాలని కోరారు. బాలాకోట్‌లో భారత ఆర్మీ జరిపిన వైమానిక దాడులను ట్విట్టర్ ద్వారా ప్రియాంక చోప్రా సమర్థించడంతో… అప్పటి నుంచి ఆమెను పాకిస్థాన్ టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనిపై ఏకంగా పాక్ మంత్రి ఐరాసకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి పాక్ కు దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, తాము ఆందోళన చెందే అంశాలపై నిర్భీతిగా మాట్లాడవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం పరిగణనలోకి తీసుకునేవాళ్లమని గుటెరాస్ స్పష్టం చేశారు. ప్రియాంక చోప్రా భారత ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్నినెలల కిందట సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినప్పుడు కూడా ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేసింది. అప్పటినుంచే ప్రియాంక అంటే పాక్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

Related posts