రెండవసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ తెలుగు రాష్ట్రాల పై దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీలో గట్టి నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ , గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ పార్టీకి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ విషయమై నలుగురు నేతలు బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఈ నలుగురు సభ్యులు కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మిగిలిన ఇద్దరు సభ్యులు తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ ను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు నెలల్లోనే రాష్ట్రం దివాళా: ఎంపీ రామ్మోహన్ నాయుడు