telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీకి ప్రత్యేక హోదానే.. మన ఎజండా.. : జగన్

everything is ready for 30th jagan oath

వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే ఎజెండాగా పనిచేయాలని దిశానిర్దేశంచేశారు. ఏపీలో ప్రతి కార్యకర్త తోడుగా నిలువడం వల్లనే ఇంతటి భారీ విజయం సాధ్యమైందన్నారు. అనైతిక రాజకీయాలు చేసిన చంద్రబాబునాయుడును దేవుడు శిక్షించాడని వ్యాఖ్యానించారు. శనివారం గుం టూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసంలో శాసనసభాపక్ష సమావేశం, అనంతరం పార్లమెంటరీ పార్టీ సమావేశం వరుసగా జరిగాయి. శాసనసభాపక్ష సమావేశంలో జగన్మోహన్‌రెడ్డిని పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

జగన్ పేరును పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, ఆదిమూలపు సురేశ్, రాజన్నదొర, బుగ్గన రాజేంద్రనాథ్, ముస్తాఫా, ఆళ్ల నాని, ప్రసాదరాజు, కోన రఘుపతి, ఆర్కే రోజా, విశ్వరూప్, నారాయణస్వామి బలపరిచారు. జగన్ ఎన్నికను పార్టీ ఎమ్మెల్యేలందరూ హర్షాతిరేకాలతో ఆమో దం తెలిపారు. అనంతరం అక్కడే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. తాజాగా ఎన్నికైన ఎంపీలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారని, దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పనిచేద్దామని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నన్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం నాతోపాటు మీరందరూ, ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మనం మరింత బాధ్యతతో ముందుకు వెళ్లాలి. దేశం మొత్తం ఏపీ వైపు చూ సేలా పనిచేద్దాం. ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాను. 3,600 కిలోమీటర్ల పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోలేను.

2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి. అప్పుడు మన సమర్థతకు ఓటేసే పరిస్థితి రావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి. సుపరిపాలనకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచింది వైఎస్సార్సీపీయే అని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమించాలి. ఏపీకి ప్రత్యేక హోదాయే అజెండా. కేంద్రాన్ని ఒప్పించి హోదా సాధించాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు.

Related posts