పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ వాయు సేన మెరుపు దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ లైన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. నేవీ, కోస్ట్ గార్డ్స్ లు సముద్రంలో సైతం తమ పెట్రోలింగ్ ను ముమ్మరం చేశాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ధృవీకరణ పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఏ సమయంలోనైనా ఆయుధాలతో కూడిన పాకిస్థాన్ సబ్ మెరైన్లు భారత ప్రాదేశిక జలాల్లో నుంచే దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చారికలు జారీ చేయడంతో సముద్ర తీరాల్లో భారీగా పెట్రోలింగ్ బలగాలను మోహరించారు. సెక్యూరిటీ ఏజెన్సీలు నేవీ, కోస్ట్ గార్డ్స్ ను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.