భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. అబుదాబి యువరాజు మహ్మద్ బిన్ జాయోద్ అల్ నాహ్యన్ ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’తో సత్కరించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసినందుకు గానూ మోదీకి ఈ అవార్డును అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో యూఏఈ మోదీకి అత్యున్నత పురస్కారానికి ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఎన్నడూ లేనంతగా భారత్తో మా బంధాలు బలపడ్డాయి. అందుకోసం నా మిత్రుడు, ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేశారని యువరాజు అన్నారు.
ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనకు జాయెద్ పురస్కారాన్ని(దేశంలో అత్యున్నతమైనది) ప్రకటిస్తున్నాను; ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేశారు.. అని అబుదాబి యువరాజు జాయెద్ అల్ నాహ్యన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇప్పటి వరకూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీ , జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తదితర ప్రపంచ నేతలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.