తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. తాప్సి ఇప్పుడు గుజరాత్కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా తాప్సీ… భూమీ పడ్నేకర్తో కలిసి నటించిన “సాండ్ కీ ఆంఖ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాలీవుడ్లో సక్సెస్ అయిన తరువాత సౌత్ సినిమా మీద చాలా సార్లు నోరు పారేసుకుంది తాప్సీ. తాజాగా ఈ భామ బాలీవుడ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాప్సీ కీలక పాత్రలో నటించిన బద్లా సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పింక్ కాంబినేషన్లో రిలీజ్ అయిన ఈ సినిమా అదే స్థాయిలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాలో తానూ కీలక పాత్రలో నటించినా.. సినీ వర్గాలు ఆ సినిమాను అమితాబ్ సినిమాగా పరిగణించటం తనను బాధపెట్టిందని తెలిపింది తాప్సీ. అంతేకాదు “సినిమాలో అమితాబ్ హీరో అయితే నేను విలన్, ఆయన కన్నా నాకే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. నేను ఆయనతో సమానంగా నటించాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అంతా అది అమితాబ్ సినిమా అన్నారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ పారితోషికాల విషయంలోనూ ఇలాంటి వివక్ష కొనసాగుతుందని తెలిపింది తాప్సీ. హీరోలతో సమానంగా కష్టపడుతున్నా హీరోలకు ఇస్తున్న స్థాయిలో తమకు పారితోషికాలు రావటం లేదు” అంటోంది. అప్పట్లో సౌత్ సినిమాల్లో తనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదని, తనని కేవలం ఓ గ్లామర్ డాల్గా మాత్రమే చూశారంటూ విమర్శించింది తాప్సీ. అంతేకాదు రాఘవేంద్రరావు మేకింగ్ స్టైల్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాప్సీ వ్యాఖ్యలపై తెలుగు సినీ అభిమానులు సీరియస్ అవ్వటంతో తాను ఆ ఉద్దేశంతో అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
previous post
next post